కానిస్టేబుల్, ఫైర్మన్ ఉద్యోగ దరఖాస్తు గడువు గురువారంతో ముగియనుంది. దీనితో చివరి రోజు భారీస్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. బుధవారం రాత్రి 10 గంటల వరకు 4.7 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్రావు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన రిక్రూట్మెంట్ల కంటే స్వరాష్ట్రంలో జరుగబోతున్న ఉద్యోగ నియామకాలకు భారీస్థాయిలో స్పందన లబిస్తున్నదని ఉన్నతాధికారులు అంటున్నారు. 4 లక్షలు దాటడం అంటే మామూలు విషయం కాదని, గతంలో జరిగిన అన్ని రిక్రూట్మెంట్లలో 2లక్షలు, 2.5 లక్షలు మాత్రమే దరఖాస్తులు వచ్చేవని, ఈ సారి 4.7 లక్షలు దాటడం శుభశూచకమన్నారు.
ఎంఫిల్, పీహెచ్డీ, ఎంటెక్, ఫార్మసీ, పీజీ ఇలా ఉన్నత విద్యనభ్యసించిన వేలమంది అభ్యర్థులు కానిస్టేబుల్, ఫైర్మెన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం ఆనందాన్నిస్తున్నదన్నారు. ప్రభు త్వం భావిస్తున్నట్టుగా ఫ్రెండ్లీ పోలీసింగ్, టెక్నాలజీ ఆధునీకరణలో కొత్త రక్తం మరింత ఉత్తేజాన్నీ నింపుతుందని తాము భావిస్తున్నామన్నారు. చివరి రోజైన గురువారం దరఖాస్తులు 5 లక్షలు దాటే అవకాశం ఉందని రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 3న కానిస్టేబుల్, ఫైర్మెన్ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ కూడా మొదటిసారి కావడంతో అభ్యర్థులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనితప్పిందని అధికారులు తెలిపారు. త్వరలో ఎస్సై నోటిఫికేషన్ విడుదలచేసి.. ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.
Comments
Post a Comment